ఆర్టీసీ ఆస్తులను ప్రైవేట్ సంస్థలకు ఎలా ధారాదత్తం చేస్తారు?: తలసాని ఆగ్రహం
- తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె
- ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లే ఈ పరిస్థితి దాపురించిందని వ్యాఖ్య
- ఎలక్ట్రిక్ బస్సులో ప్రైవేట్ డ్రైవర్లు, కండక్టర్లను ఎందుకు నియమిస్తున్నారని ప్రశ్న
- ఆర్టీసీ ఉద్యోగులనే ఆ బస్సులకు కేటాయించాలని డిమాండ్
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ప్రారంభమయింది. బస్సులు ఎక్కడికక్కడ డిపోలకే పరిమితమయ్యాయి. ఆర్టీసీ సమ్మె కారణంగా సాధారణ ప్రజలు, విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లే ఈ పరిస్థితి దాపురించిందని ఆయన మండిపడ్డారు.
కొత్తగా ప్రవేశపెడుతున్న ఎలక్ట్రిక్ బస్సుల్లో ప్రైవేట్ డ్రైవర్లు, కండక్టర్లను ఎందుకు నియమిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. అనుభవం ఉన్న ఆర్టీసీ ఉద్యోగులనే ఆ బస్సులకు కేటాయించాలని, తద్వారా వారి ఉపాధిని కాపాడాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీకి చెందిన విలువైన డిపోలు, ఆస్తులను ప్రైవేట్ సంస్థలపరం చేయడం ఏంటని నిలదీశారు. ఇది సంస్థను నిర్వీర్యం చేయడమేనని ఆరోపించారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి, ఇప్పుడు సమ్మె వల్ల వారిని ఇబ్బందుల్లోకి నెట్టారని విమర్శించారు. పేదలు, విద్యార్థులు, ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం తక్షణమే స్పందించి కార్మికుల సమస్యలను పరిష్కరించి సమ్మెను విరమింపజేయాలని అన్నారు.